Tuesday, April 21, 2009

వివాహం 5


బెల్లం:-
ప్రతిష్ఠాకాముడైనవాడు  కామేష్టి యందు క్షేత్రపత్స చరువును, ఇష్టిని చెయ్యాలని శృతి విధిస్తోంది. ఇది భూమి మీద చిరకాల స్ధితిని కోరేవాడు చెయ్యాలి.

మంత్రం:-క్షేత్రస్య పతే మధుమంతం ఊర్మిం .......... మృడయంతు.
ఈ మంత్రంలో భూమిని సంబోధించడం జరుగుతోంది . ఓ భూదేవతా! ధేనువు నూతనంగా ప్రసవించిన ఆవు పాలను ఇచ్చునట్లుగా నీవు మాధుర్య రసముతో కూడినట్టి పదార్ధములను ఇచ్చుచున్నావు.

ఘృతం:- నెయ్యి వలే పర్యూషితత్వ దోషం లేకపోవుటచేత అతి పవిత్రమైన నారికేళము, ఇక్షు ఖండం, బెల్లం మొదలైన భోగ్య పదార్ధ సమూహాన్ని మాకు ఇమ్ము. యజ్ఞపతులు మమ్ములను సుఖపెట్టెదరు గాక.

ఈ మంత్రంలో భూమి దేవతను భోగ్య పదార్ధములను ఇమ్మని కోరే సందర్భంలో ఆ భోగ్య వస్తు పరంపరలో బెల్లమును కూడా పరిగణించి ఆ బెల్లమునకు నాలుగు విశేష గుణములను చేర్చారు. అవి ౧.ఆ బెల్లము మాధుర్యోపేతము. తరంగముల వలె అవిచ్చిన్నమైనది. ౨.తన మాధుర్యమును ఇతర వస్తువుల యందు సంక్రమింపజేస్తుంది. ౩. ఘృతం వలె పవిత్రమైనది.అన్నము మొదలైన వండిన పదార్దములు ఈ రోజు వండినవి మరునాటికి పనికిరావు. కనుక అపవిత్రమవుతాయి. వాటిని తింటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అవి పర్యూషితాలు కనుక. ఘృతానికి పర్యూషిత దోషం లేదు. ఈ విధంగా బెల్లం అనేక సత్ గుణాలతో కూడుకొని ఉంది. అందు చేత ఇంత పవిత్రమైన జీలకర్ర, బెల్లాన్ని మిశ్రమం చేసి వధూవరులు పరస్పర హస్తాలతో శిరస్సున మంచి సుముహూర్త సమయంలో ఉంచడం ఆచారమై ఉంది. దీని వలన వధూవరుల శరీరంలో పరస్పరం ఒక విజాతీయమైన సంస్కారం కలుగుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇట్టి మార్పునకు అనుకూలమైన పరమ మంగళ పదార్ధముల సమ్మేళనము పరస్పర ప్రీతికి సాధనము. కనుకనే శిష్టాచారంలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సుముహూర్త సమయంలో చూర్ణికను పఠించేటప్పుడు దానిలో మంగళ ద్రవ్యములను పఠించి, అవి మంగళ కరములు అగు గాక! అని అనుటచే ఆ సమయంలో మంగళద్రవ్య వాచక పదములను పఠించిన మాత్రం చేతనే మంగళ ప్రాప్తి కలుగుతుంటే మంగలమునూ , పావనమునూ అయిన బెల్లము, జీలకర్ర కలిపిశిరస్సునందు ఉంచుటవలన విశేషమైన శ్రేయః ప్రాప్తి అగునని వేరే చెప్పనవసరం లేదు.

సమీక్షణం
వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడడాన్నే సమీక్షణం లేక నిరీక్షణం అంటారు. వేదిక పైన వధువే తూర్పు ముఖంగా కూర్చుంటుంది. వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటాడు. వీరిద్దరి మధ్యా అడ్డుగా తెల్లటి తేరసెల్లాను పట్టుకుంటారు. శుభ ముహూర్త కాలంలో వరుడు వధువుకనుబొమ్మల మధ్య అలక్ష్మీ తొలగుటకై దర్భలతో తుడిచి వధూవరులు ఒకరినొకరు వీక్షించుటను సమీక్షణం అంటారు. ఈ సమీక్షణ కార్యక్రమమును కులాచారమును బట్టి ఆచరించెదరు.

యుగాచ్చిద్రాభిషేకం
వివాహ సమయంలో దర్భను చుట్టగా చుట్టి వధువు శిరస్సు పై ఉంచి నాగలి కాడిని వధువు శిరస్సు పై ఉత్తర దక్షినములుగా ఉంచి నలుగురు బ్రాహ్మణులు ఆ కాడిని పట్టుకొని ఆ కాడి యొక్క ఉత్తరంవైపున ఉన్నా రంధ్రంలో మామిదికోమ్మను ఉంచి దక్షిణం వైపున ఉన్నా రంధ్రంలో బంగారపు మంగళసూత్రమును ఉంచి పాలను ఆ బంగారపు మంగళ సూత్రములపై ఐదు మంత్రములతో అబిషేకిన్చేదారు. ఆ పాలు వధువు శిరస్సు మీద పడాలి.
దర్భలు చుట్ట చుట్టి వధువు శిరస్సు పై పెట్టుటకు కారణం ఉన్నది. అది ఏమనగా "పవిత్రం వై దర్భాః అపామ్వా ఏష ఒషదీనాగుం రసో యద్దర్భాఃఅని శ్రుతులు దర్భలు పవిత్రమైనవని చెప్పాయి. కనుక వాటి చేత సంమార్జనం మంత్ర పురస్సరంగా చేయుటవలన అలక్ష్మీ నశిస్తుందని తాత్పర్యం.
ఈ విధంగా యుగాచ్చిద్రాభిషేకం చేయుటకు ఒక ఇతిహాసము ఉన్నది. పూర్వం అపాల అనే ఒక కన్య ఉండెడిది. ఆ కన్య బొల్లి రోగ గ్రస్తురాలు అగుట వలన ఎవ్వరూ ఆ కన్యను వివాహం చేసుకొనలేదు. కాని ఆమె మనస్సులో యజ్ఞంలో ఇంద్రుని పూజించాలి ఎలాగ?అని దిగులుతో ఉండేది. అంటే వివాహం చేసుకొని భర్తతో యజ్ఞంలో ఇంద్రునికి సోమరసాన్ని హోమం చేసే అదృష్టం ఎప్పటికైనా వస్తుందా? అని నిరంతరం మనస్సులో చింతిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజున స్నానానికి నదికి వెళ్ళింది. నదిలో దిగి స్నానం చేస్తుండగా ఆ నీటి వేగానికి కొట్టుకొని పోతుంది.
అంతలో దైవవశం చేత ఆ ప్రవాహంలో ఒక సోమలత తన వద్దకు కొట్టుకు వచ్చింది. నేను వివాహం చేసుకొని భర్తతో కలిసి యజ్ఞంలో సోమలతను శాస్త్రీయంగా దంపి ఆ రసాన్ని ఇంద్రునకిచ్చే భాగ్యం లేదుకదా! అని తన దగ్గరకు వచ్చిన సోమలతను దంతములతో నమిలి ఆ రసాన్ని ఇంద్రుని ఉద్దేశించి ఉమ్మి వేసింది. ఆమె భాగ్య వశం చేత ఆ సమయంలో ఇంద్రుడు ఆకాశంలో రథం మీద వెడుతూ శబరి వలె ఉన్న ఆమె భక్తి పారవశ్యానికి సంతోషించి రథముయొక్క కాడి వగైరాల నుండి ఆమెపై ముమ్మారు అమృత సేచనం చేసి బొల్లి రోగాన్ని పోగొట్టాడు. ఆమెను సూర్య వర్చస్సు కల దానినిగా చేసాడు. అందుచేత కాడి రంధ్రముల నుండి స్రవించే సువర్ణ సంసృష్టములైన ఉదకముల స్నానంచేత ఈ కన్యకు వర్చస్సును బోధించే "ఖేనసః" అనే మంత్రం చేత యుగము యొక్క చిద్రమును శిరస్సునందలి దర్భేణ్వమునందు   ఉంచాలి

No comments:

Post a Comment