Wednesday, April 22, 2009

వివాహం 7






శ్లోకం:- మాంగల్య తంతునానేనా మమ జీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం

మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు.

నా జీవన హేతువైన ఈ మంగళ సూత్రమును గుర్తుగా నీ కంఠమందు కడుతున్నాను. మూడు ముళ్ళూ వేస్తున్నాను. నీవు నిండు నూరేండ్లు బ్రతుకు అని ఆ వేసిన ముడులకు కుంకుమ అద్దాలి. ఈ మూడు ముడులలో 1.ధర్మ పురుషార్ధానికి సంకేతము.2.అర్ధ పురుషార్దమునకు సంకేతము. 3.కామ పురుషార్ధమునకుసంకేతము అని ఆర్యుల వచనం.

1.గత జన్మ బంధం 2.ఈ జన్మ బంధం 3.భవిష్యత్ జన్మ బంధం అని కొందరు అందురు.

అంటే!అన్యోన్య అనురాగంతో జన్మ జన్మలకు ఈ మైత్రి బంధం మన ఉభయులకూ, అలాగే సాగాలని ప్రేమ బంధం మూడు మారులు వెయ్యడం జరిగింది అన్నారు మరి కొందరు. త్రికరణయా మనసా , వాచా, కర్మణా నీ భారం వహిస్తాను. కనుక నీవు నా భార్యవు. అని మూడు ముడులు వేస్తున్నాను అని భావమన్నారు కొందరు.

ఈ మంగళ సూత్రములను తయారు చెయ్యడంలో గుండ్రని వర్తులాకారంలో మధ్యన బొటిమ వంటి దానిని నిర్మిస్తారు. ఇది స్ఫోటము. దీని విషయంలో అగ్నిచయనమనే క్రతువులో యజమాని కంఠమునకు ఇరవైఒక్క స్పోటములు కలిగిన సృవం రుక్మమును కడతారు. ఈ ఇరవై ఒక్క సంఖ్యకు కారణం ఏమిటో ఇలా చెప్పబడింది. దేవలోకములు ఇరవై ఒకటి. కనుక ఈ రుక్మమునకు ఇరవై ఒక్క స్పోటములచేత ఇరవై ఒక్క దేవలోకముల నుండి కూడా శత్రువును కనుపించకుండా చేస్తుందని శృతి చెప్పడం వలన వివాహంలో నిర్బాధం వలన ఈ లోకంనుండి శత్రువును అంతర్హితుని చేసే ఉద్దేశ్యంతో ఒక స్పోటము ప్రస్తుతం మంగళ సూత్రములకు నిర్మితమవుతోందని భావించాలి. మంగలసూత్రమును వరుడు వదువునకు అభిముఖుడై పై శ్లోకము చెప్పుచూ కంఠమందు 21 స్ఫోటములు కలిగిన సువర్ణ రుక్మమును కడతారు. కనిపించకుండా చేసే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఒక స్ఫోటముతో మంగళ సూత్రం నిర్మితమవుతోందని భావించాలి. మంగలసూత్రమును వరుడు వధువునకు అభిముఖుడై ఈ శ్లోకం చెప్పుచూ మూడు ముళ్ళు వెయ్యాలి. నీ మనస్సుకూడా ఈ బంధమందు లగ్నమై ఉండుగాక.1.మనస్సుతో 2.వాక్కుతో 3.శారీరక క్రియతో సౌమనస్యంతో ఉండుగాక.నీ భారం వహిస్తున్నాను అని భావమన్నారు కొందరు.

ఈ మూడు ముడులలో మరో గొప్ప అర్ధం ఇమిడి ఉంది.
ఓ కన్యా మన ఉభాయులద్వారా 21 తరాలు తరించాలి. ఒక ముడికి ఏడు తరముల చొప్పున మూడు ముడులకు మూడు ఏడులు ఇరవై ఒక్క తరములు కదా! వారుతరించాలి. నిన్ను నాకు నీ తండ్రి ఇచ్చేటప్పుడు మహా సంకల్పంతో ఇచ్చాడు.దశ పూర్వేషాం అనగా మనకి ముందు పది తరాలు, దశ అపరేషాం అనగా మనకి వెనుక పది తరాలు , మనతో 21 తరాలు అయినది. ఇది సార్ధకం కావడానికి ఈ మూడు ముడులు గుర్తుగా వేస్తున్నాను అని అర్ధం.
 
తలంబ్రాలు

వధూవరులు ఒకరి తలపై మరొకరు పసుపుతో తడిపిన అక్షతలను దోసిళ్ళతో పోసుకోవడాన్ని తలంబ్రాలు పోసుకోవడం అంటారు. దీనినే అక్షతారోపణం అనికూడా పిలుస్తారు. ఇది చూడడానికి చాలా వేడుకగా కనపడుతుంది. పెండ్లికి వచ్చిన బందుమిత్రులంతా వివాహంలో ఏఘట్టాన్ని చూసినా,చూడకపోయినా దీనిని మాత్రంచూడకుండా ఉండరు. తెలుగు దేశంలో ఈ సందర్భంలో ప్రత్యేకమైన సన్నాయి వాద్యం కూడా వినబడుతుంది. వీటన్నింటితో పాటు ఇక్కడ జరిగే క్రియా క్రమంలో చెప్పే మంత్రాలలో చాలా విశిష్టత కనబడుతుంది.

వరుడు వధువు దోసిట్లో ఎండు కొబ్బరి చిప్పతో రెండు మార్లు అక్షతలను పోసి పాలతో ప్రోక్షించి పెండ్లి కూతురి దోసిలి పైన పెండ్లికొడుకు దోసిలి పెడతారు. ఈ మంత్రాలను చదువుతారు. "కపిలాగుస్మారయతు...............శాంతిరస్తు " కర్రి ఆవులను స్మరించండి ! అనేక దానాలను చెయ్యండి. పుణ్యం వృద్ధి పొందాలి. శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి కలగాలి. సత్కర్మలు వృద్ధి పొందాలి. నక్షత్రాలవల్ల , గ్రహాలవల్ల, సోమునివల్ల , మన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. ఈ క్రింది మంత్రాలను చెబుతూ వరుడు, వధువు తలపైన మొదటి తలంబ్రాలను పొయ్యాలి.

"ప్రజాపతిః స్త్రియాం యశః..................... తస్యాగ్నే భాజఏహమా"

ప్రజాపతి భార్యలో కీర్తి కారణమైన వీర్యాన్ని వృషణాలలో ఉంచాడు. దానివలన కలిగే కామ తృప్తిని, ఆనందాన్ని మా దాంపత్యంలో కలిగించు.

 "మోదః ప్రమోదః ఆనందః ................. దక్షిణానాం ప్రతిగ్రహే"

 సంతోషం, పరవశత్వం, ఆనందం , వీటి మూడింటిని కలిసి వృషణాలలో ఉంచాడు. ప్రజాపతి దక్షిణలను స్వీకరించినప్పుడు కన్యలను పరిగ్రహించినంత తృప్తి కలుగుతుంది .

"మనసః కామమాకూతిం ............శ్రయతాం మయి"

మనమిద్దరి మనస్సుకు సంబంధించిన విజ్ఞానాన్ని, మంచి సంకల్పాన్ని, సత్యాన్ని పొందాలి. అలాగే పశుసంపద , అన్న సంపద వాటి ద్వారా వచ్చే కీర్తిని ప్రతిష్ఠను అనుభవించాలి.

యథాహమస్య ..............................కామ్యః ప్రియః

 యజ్ఞానికి ఇష్టుడనైన నేను, ప్రియురాలు ప్రియునితో ఎలా తృప్తిని పొందుతుందో అలాగే తృప్తిని పొందుతాను.




No comments:

Post a Comment